Aay Maadi Narasapuramandi: అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కారుణ్యం వల్లనే ఆయ్ .. మాది నరసాపురమండీ అనే మా సొంత ఊరి అనుబంధాల, ఆత్మీయతల, భౌగోళిక, నైసర్గిక, ప్రాచీన కట్టడాల చరిత్ర, కళాశాలల, పాఠశాలల విశేషాలతో పాటు పెద్దతరాల అంశాలను పొందుపరచిన గ్రంధాన్ని తెలుగు పాఠకులకు అందించగలిగానని ప్రముఖ రచయిత్రి, అచ్చంగా తెలుగు ప్రచురణలు సంస్థ చైర్మన్ శ్రీమతి భావరాజు పద్మినీ ప్రియదర్శిని పేర్కొన్నారు.
మంచు కప్పిన గోదారి, నీరెండ మెరిసే గోదారి, రెల్లు గడ్డితో సరసమాడే గోదారి.. నదీ పరివాహక ప్రాంతంలో బాల్యం గడిపిన జనాలకి భావుకత్వం దానంతట అదే వస్తుందని, బావరాజు పద్మిని పుస్తకం ఆయ్ మాది నరసాపురమండీ చదివితే అదే అనిపిస్తుందని విఖ్యాత నవల రచయిత యండమూరి వీరేంద్రనాధ్ గురువారం పద్మినిపై ప్రశంసలు వర్షించారు. ఇలాంటి బుక్స్ చదవటంవల్ల అనుభూతులు, అనుబంధాలు తెలుస్తాయని యండమూరి పేర్కొన్నారు. అత్యంత శక్తి సంపన్నమైన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధానంలో ఈ ఆయ్ .. మాది నరసాపురమండీ గ్రంధాన్ని భావరాజు పద్మినీ తన మిత్ర బృందంతో కలిసి ఆవిష్కరించడంపట్ల హైదరాబాద్లో అనేకమంది సాహితీ ప్రముఖులు, కవయిత్రులు, ప్రచురణకర్తలు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా తొలిప్రతి స్వీకరించిన ప్రముఖ సాహితీ విశ్లేషకులు, కవి రెడ్డప్ప ధవేజీ మాట్లాడుతూ.. ఆయ్ .. మాది నరసాపురమండీ గ్రంధాన్ని తెరిస్తే ఎన్నో అనుభూతులు, అనుభవాలు, ఆనందాలు ముప్పేటలై పరవశింప చేస్తాయని వివరిస్తూ భావరాజు పద్మిని అద్భుతంగా ఈ సొంతూరి ముచ్చట్లను ఇలా గ్రంధస్తం చేయడం రాబోయే తరాలకు తెలిసేలా చేశారని అభినందించారు.

ఈ కార్యక్రమంలో అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు రమేష్, భావరాజు పద్మిని మిత్ర బృందం లక్ష్మి, పద్మావతి, నగీనా, అనసూయ, వల్లి, ఈష, భట్టిప్రోలు సత్యనారాయణ, శేషగిరి, ఫణిబాబు తదితరులు పాల్గొన్నారు.




