ఇటీవలే పుష్ప చిత్రానికి జాతీయ ఉత్తమనటుడుగా అవార్డు సాధించి జాతీయ వార్తలో నిలిచాడు కథానాయకుడు అల్లు అర్జున్. కాగా త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో, అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తరపున అల్లుఅర్జున్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాడని ఊహగానాలు మొదలయ్యాయి టాలీవుడ్లో.
ఇటీవల అల్లుఅర్జున్ తెలంగాణలోని నల్లగొండ జిల్లాలోని తన మామ స్వగ్రామంలో కంచర్లకన్వెషన్ పేరుతో నిర్మించిన ఫంక్షన్హాల్ను అక్కడికి వెళ్లి అశేష అభిమానులు, జనసందోహం మధ్య ప్రారంభించారు.చంద్రశేఖర్ రెడ్డి రానున్న ఎన్నికల్లో నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నుంచి బీఆర్ ఎస్ టికెట్ను ఆశించారు. అందుకు తగ్గట్టు ఆయన ఆయన నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లుఅర్జున్తో ఈ ప్రారంభోత్సవం కార్య్రకమం నిర్వహించి అధిష్టానం దష్టిలో వుండాలని ప్రయత్నించాడు. దీంతో తన పలుకుబడిని, తన అల్లుడు క్రేజ్ను అధిష్టానంకు చూపించి టికెట్ పొందవచ్చని ఆయన ఆశించారు.
2014 ఎన్నికల్లో నే చంద్రశేఖర్ రెడ్డి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి టీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 24 వేల పై చిలుకు ఓట్లు సాధించారు. అయితే ఆ ఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆ తరువాత టీఆర్ ఎస్లో చేరడంతో చంద్రశేఖర్ రెడ్డిని పార్టీ పక్కన పెట్టింది.దీంతో ఆయన తన స్వస్థలమైన నాగార్జున సాగర్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకుని ఆ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టాడు. అయితే ఇటీవల బీఆర్ ఎస్ ప్రకటించిన అభ్యర్థుల జాబితా లిస్ట్లో కంచర్ల చంద్రశేకర్ రెడ్డి పేరు లేదు. నాగార్జున సాగర్ నుంచి సిట్టింగ్ ఎమ్మేల్యే నోముల భగత్కే ఆ సీటు కేటాయించడంతో చంద్రశేఖర్ రెడ్డి అక్కడి నుంచే కాంగ్రెస్ నుంచి లేదా ఇండిపెండెంట్గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది. అయితే మామ కోసం అల్లు అర్జున్ ఎన్నికల్లో ప్రచారం చేస్తాడని టాలీవుడ్లో గుసగుసలు మొదలయ్యాయి. ఒకవేళ మామ కోసం అర్జున్ ప్రచారం చేస్తే ఆయన గెలుపుకు అవకాశం వుంటుందని అంటున్నారు రాజకీయ వర్గాలు. మరి బన్నీ ఛరిష్మా అంటే మామూలా… తగ్గేదేలే