నందిగ్రామ్: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. తృణమూల్, బీజేపీ నేతల మధ్య ప్రధానంగా మాటల యుద్ధం తారస్థాయికి చేరుతోంది. ఈ క్రమంలోనే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్తలు పోలీసు యూనిఫాంలు ధరించి ప్రజలను భయపెడుతున్నారని, దీనికోసం మార్కెట్లో నుంచి పోలీసు యూనిఫాంలు కొనుగోలు చేస్తున్నారని షాకింగ్ ఆరోపణలు చేశారు. సీపీఎం కార్యకర్తలు కూడా పోలీసు యూనిఫాంలు కొనుక్కొని మారువేషాల్లో ఓటర్లను భయపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. పోలీసు దుస్తుల్లో బీజేపీ కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్లి, కమలం పార్టీకే ఓటు వేయాలని గ్రామీణులను బెదిరిస్తున్నట్టు మమతా బెనర్జీ ఆరోపించారు. నందిగ్రామ్లో సోమవారం నాడు జరిగిన బహిరంగ సభలో మమత పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఈ సంచలన ఆరోపణలతో బీజేపీపై నిప్పులు చెరిగారు.
మత విద్వేషాల సృష్టి..
రాష్ట్రంలో హిందూ, ముస్లిం వర్గాల మధ్య బీజేపీ విభేదాలు సృష్టిసోందని మమత ఆరోపించారు. నందిగ్రామ్లో నిరసనలు జరిగినప్పుడు హిందువులు శంఖం ఊదితే, ముస్లింలు ‘అజాన్’ (ప్రార్థనలు) చేశారని, ఇక్కడ ఇరువర్గాల ప్రజలు ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటారని ఆమె చెప్పారు. అంతేగానీ విభజించి, పాలించే విధానం ఇక్కడ లేదని అన్నారు. మమతా బెనర్జీ నందిగ్రామ్ నుంచే పోటీ చేస్తున్నారు. ఈ స్థానాన్ని ఆమె ఎంతో ప్రతిష్టాత్మకంగా పక్కాగా అన్ని జాగ్రత్తలూ తీసుకుని విజయం కోసం కృషి చేస్తున్నారు. ఏప్రిల్ 1న జరిగే రెండో విడత పోలింగ్లో ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి. కాగా, ఇటీవల ప్రచారం సమయంలో ప్రమాదానికి గురైన మమత కాలుకు గాయమైన సంగతి తెలిసిందే. ఈ గాయాన్ని కూడా లెక్కచేయకుండా ఆమె పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ తృణమూల్ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.