భీష్ముడు మహాభారతంలో ప్రముఖుడు. కురుక్షేత్రం తరువాత అంపశయ్యపై దాదాపు నెలన్నర రోజులు జీవించి ఉండి మాఘ శుక్ల ఏకాదశి రోజున పరమపదించారు. అందుకే ఆ రోజుకి భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది. అందరు ఆయన్ని భీష్మ పితామహుడు అని పిలుస్తుండేవారు. ఈయనికి ఎన్నో ధర్మ సూత్రాలు తెలుసు. మరణ శయ్యపై ఉండి వాటిని ఎప్పుడు వీడలేదు. అందుకే ఇప్పటికి ఆయన పరమపదించిన రోజుని కొన్ని ప్రాంతాల్లో ఒక పండగలా జరుపుకుంటూ ఉంటారు.
నేడు భీష్మ ఏకాదశి సందర్భంగా నటసింహ నందమూరి బాలకృష్ణ ఎన్ టీ ఆర్ కధానాయకుడు చిత్రంలో తాను భీష్ముని పాత్రలో నటించిన స్టిల్స్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ..
“భీష్మ పాత్రంటే నాకెంతో ఇష్టం. నాన్న గారు, ఆయన వయసుకి మించిన భీష్మ పాత్ర పోషించి ప్రేక్షకుల విశేష ఆదరాభిమానాలను అందుకున్నారు. ఆ చిత్రం, అందులోని నాన్నగారు నటించిన భీష్ముని పాత్ర అంటే నాకెంతో ఇష్టం. అందుకనే ఎన్ టీ ఆర్ కధానాయకుడు చిత్రంలో భీష్ముని సన్నివేశాలు తీశాము. అందులో నేను భీష్మునిగా నటించాను. అయితే నిడివి ఎక్కువ అవడం వలన ఆ చిత్రంలో ఆ సన్నివేశాలు ఉంచడం కుదరలేదు. ఇవాళ భీష్మ ఏకాదశి పర్వదిన సందర్భంగా ఆ పాత్రకి సంబంధించిన ఫోటోలను ప్రేక్షకులతో, అభిమానులతో పంచుకోవాలనుకుంటున్నాను.” అన్నారు.