సూపర్ స్టార్ రజినీకాంత్ మరియు దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో ఒక చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ‘కూలీ’ అనే టైటిల్ పెట్టారు. ఇది రజినీకాంత్ యొక్క 171వ చిత్రం. ఈ సినిమాకి గతంలో ‘తంగం, రాణా’ అని పేర్లు వినిపించాయి. ఇప్పుడు ‘కూలీ’ అని టైటిల్ ఖరారు చేస్తూ టైటిల్ లుక్ను కూడా వదిలారు. ఈ టైటిల్ను పవర్ ప్యాక్డ్ టీజర్ ద్వారా రివీల్ చేశారు. ఇందులో రజినీకాంత్ యాక్షన్, ఇంకా డైలాగులు బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ టీజర్ హల్చల్ చేస్తోంది.
‘ఖైదీ, విక్రమ్, లియో’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్.. రజినీకాంత్తో చిత్రాన్ని ప్రకటించడంతో కోలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్లో కూడా ఆసక్తి నెలకొంది. వీళ్లిద్దరూ తెలుగు ఆడియన్స్కు బాగా దగ్గరైన వ్యక్తులు. ఈ టీజర్ సూపర్స్టార్ రజినీకాంత్ను స్టైలిష్, యాక్షన్-ప్యాక్డ్ అవతార్లో ప్రజెంట్ చేసింది. అతను గోల్డ్ స్మగ్లర్ల డెన్లోకి ప్రవేశిస్తాడు. బంగారు గడియారాలతో చేసిన గొలుసుతో వారిని తుక్కుగా కొడతాడు. ఆ తర్వాత స్మగ్లింగ్ ముఠా బాస్కి ఫోన్లో వార్నింగ్ ఇస్తాడు. సన్ పిక్చర్స్ పతాకం పై కళానిధి మారన్ సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని 2025లో విడుదల చేయనున్నారు.