తెలంగాణ: సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని అనేక రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. జుక్కల్ నియోజకవర్గం పిట్లంలో కుల్లగడగి (కుల్లె కడిగి), చిట్టెపు రాష్ట్ర స్థాయి ఆత్మీయ సమ్మేళనం మరియు కృతజ్ఞత సభలో ఆమె ఈ విధంగా స్పందించారు. ఆమెతో పాటు ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే హన్మంత్ షిండే, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ‘‘కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అన్ని కులాల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కేవలం అతి తక్కువ సమయంలోనే కట్టిన ఘనత సీఎం కేసీఆర్ గారిది. వరి పంట విషయంలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్తో పోటీ పడి మరీ ముందుకు వెళుతోంది. కుల్లగడగి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిట్టెపు శివసాయి పటేల్ తెలంగాణ ఉద్యమ కాలం నుండి సీఎం కేసీఆర్గారి వెంట నడిచారు. ప్రత్యేక రాష్ట్రంలో, బీసీ కమిషన్ అధ్యయనం తరువాత చిట్టెపు కులాన్ని రాష్ట్ర ప్రభుత్వం బీసీల్లో చేర్చిందనే విషయం తెలిసిందే. ఎమ్మెల్యే హన్మంత్ షిండేగారి పట్టుదల కారణంగానే పిట్లం మండలానికి సీఎం కేసీఆర్ గారు ‘నాగమడుగు’ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశారు. అలాగే ఎమ్మెల్యే గారు కోరిన మిగతా మూడు సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తాము’’ అని పేర్కొన్నారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘‘జుక్కల్ అభివృద్ధిలో వంద శాతం తన పాత్ర ఉంటుందని హామీ ఇస్తున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో పరిష్కారం కాని సమస్యలను ప్రత్యేక రాష్ట్రంలో అనతికాలంలోనే పరిష్కరించామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నికల్లో లబ్ధి కోసం కాకుండా, ముందు తరాల వారికి ఉపయోగిపడటమే లక్ష్యంగా పనిచేస్తున్నాము. అంతేకాదు చిన్న రాష్ట్రం అయినా తెలంగాణ అనేక అంశాల్లో నెం.1 గా నిలిచింది. రాష్ట్రంలో అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కుల్లగడగి కులస్తులకు కోరుతున్నాను..’’ అని తెలిపారు.