దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కొత్త పార్టీ స్థాపించబోతున్నారని ఓ ప్రముఖ దినపత్రికలో ఫ్రంట్ పేజీలోనే సంచలన కథనం వచ్చిన విషయం విదితమే. ఆ కథనం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెను సంచలనమైంది. పలువురు ప్రముఖులు దీనిపై స్పందించి స్వాగతించగా.. మరికొందరు మాత్రం అస్సలు జరిగే పనే కాదని చెప్పుకొచ్చారు. అయితే మౌనానికి అంగీకారమేనని అందరూ అనుకుంటున్న తరుణంలో వైఎస్ షర్మిల స్పందించి ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ సంచలన కథనంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రకటన యథావిధిగా..
‘‘ఈ ఆదివారం ఆంధ్రజ్యోతి పత్రికలో బ్యానర్ ఐటమ్గా వచ్చిన వార్త నా దృష్టికి ఆలస్యంగా వచ్చింది. వైఎస్సార్గారి కుటుంబాన్ని టార్గెట్ చేసి దురుద్దేశంతో రాసిన రాతలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏ పత్రిక అయినా, ఏ చానల్ అయినా ఓ కుటుంబానికి సంబంధించిన విషయాలను రాయటమే తప్పు. అది నీతిమాలిన చర్య. అటువంటి తప్పుడు రాతలు రాసిన పత్రిక, చానల్ మీద న్యాయపరమైన చర్యలకు వెనకాడబోమని తెలియజేస్తున్నాను’’ అని షర్మిల ప్రకటనలో పేర్కొన్నారు.
మొత్తానికి చూస్తే.. కొత్త పార్టీపై క్లారిటీ ఇవ్వడంతో వైసీపీ వీరాభిమానులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో.. కొత్త పార్టీ లేదని ఈ ప్రకటనతో షర్మిల చెప్పేశారన్న మాట. మరి షర్మిల క్లారిటీ ఇచ్చింది కాబట్టి.. ఇకనైనా షర్మిళ కొత్త పార్టీ వార్తలు ఆగుతాయో.. లేదంటే మరో కోణంలో ప్రజంట్ అవుతాయో వేచి చూడాల్సి ఉంది.