AP CM YS Jagan Press Meet: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేవుడికి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం నాడు తాడేపల్లిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో నవరత్నాలు, ప్రభుత్వ పథకాల అమలుపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్తో పాటు అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. గత 20 నెలలుగా మీ అందరితో కలిసి పని చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అధికారులతో పలు విషయాలను జగన్ పంచుకున్నారు. ‘ఒక నానుడి ఉంది. క్రికెట్లో కెప్టెన్ ఒక్కడి వల్లనే గెలుపు సాధ్యం కాదు. మొత్తం టీమ్ కలిసి సమష్టిగా కృషి చేస్తేనే ఏదైనా విజయం సాధ్యం అని.. మీ వంటి టీమ్ ఇక్కడ ఉన్నందుకు నేను దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
మీలో ప్రతి ఒక్కరూ ఎంతో నిష్ణాతులు, సమర్థులు. అందరూ సమష్టిగా కృషి చేసినందువల్లనే రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలిగాము. దిశ చట్టం మొదలు.. మహిళలు, పిల్లలకు భద్రత కల్పించడంలో ఆ చట్టం ఒక విప్లవాత్మక పరిణామమని చెప్పవచ్చు. ఆ తర్వాత గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ. ఇలా చెప్పుకుంటూ పోతే జాబితాలో ఇంకా ఎన్నో ఉన్నాయి’ అని అధికారులతో జగన్ అన్నారు. జగన్ చెప్పిన ఈ మాటలతో అధికారులు కొందరు భావోద్వేగానికి గురయ్యారు.