మీరు విమాన ప్రయాణం చేయాలని అనుకుంటున్నారా? ఈ ప్రయాణాల్లో ఎటువంటి లగేజ్ తీసుకెళ్లాలని అనుకోవడం లేదా? అయితే మీలాంటి వారి కోసమే ఓ భారీ ఆఫర్ వచ్చేసింది. ఇలా భారీ లగేజి ఏదీ లేకుండా విమాన ప్రయాణం చేయాలని అనుకునే వారికి విమాన ప్రయాణ చార్జీల్లో ఇక నుంచి డిస్కౌంట్ లభించనుంది. కేవలం క్యాబిన్ బ్యాగులతో మాత్రమే ప్రయాణం చేసే వారికి ఈ రాయితీ వర్తిస్తుందట. ఈ మేరకు డీజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నుంచి కొత్తగా మార్గదర్శకాలు విడుదల అయినట్లు తెలుస్తోంది. ఓ సారి ఈ ఉత్తర్వులను పరిశీలిస్తే..
లగేజ్ లేకుండా ప్రయాణించే వారికి త్వరలో టికెట్ ధరల్లో రాయితీ కల్పిస్తామని డీజీసీఏ స్పష్టం చేసింది. ఇకపై చెక్ ఇన్ లగేజ్ లేకుండా కేవలం క్యాబిన్ బ్యాగులతో మాత్రమే ప్రయాణించే వారికి టికెట్లపై రాయితీలు దొరుకుతాయి. ఈ మేరకు దేశీయ విమానయాన సంస్థలకు డీజీసీఏ నుంచి శుక్రవారం నాడు అంటే ఫిబ్రవరి 26న ఉత్తర్వులు అందాయి.
ప్రస్తుత నిబంధనల ప్రకారం… విమాన ప్రయాణికులు ఏడు కిలోల వరకు క్యాబిన్ బ్యాగేజ్, 15 కిలోల వరకు చెక్ ఇన్ లగేజ్ తమ వెంట తీసుకొని వెళ్లవచ్చు. అంతకంటే ఎక్కువ లగేజ్ తీసుకెళితే.. అదనపు చార్జీలు వసూలు చేస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన నిబంధనల ప్రకారం… ఇకపై చెక్ ఇన్ బ్యాగ్లు లేకుండా కేవలం క్యాబిన్ బ్యాగులతో మాత్రమే ప్రయాణించే వారికి విమానయాన సంస్థలు టికెట్ల ధరలో రాయితీలు ఇస్తాయి.
ఈ రాయితీలు పొందాలంటే… ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే తమ వెంట తీసుకెళ్లే బ్యాగ్ బరువు వెల్లడించాల్సి ఉంటుంది. ‘‘ఎయిర్లైన్ బ్యాగేజీ పాలసీ మేరకు… విమానయాన సంస్థలు ప్రయాణికులకు ఉచిత బ్యాగేజ్ అలవెన్సులతో పాటు జీరో బ్యాగేజ్/నో చెక్ ఇన్ బ్యాగేజ్ ధరల స్కీంను అందించేలా అనుమతి ఇస్తున్నాం. ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఈ టికెట్ ధరల స్కీం గురించి వారికి తెలియజేయాలి. ఇక ఈ వివరాలను టికెట్పై తప్పనిసరిగా ప్రింట్ చేయాలి’ అని డీజీసీఏ వెల్లడించింది.