Bus Conductor: ఏడాది క్రితం ప్రపంచం మొత్తం ఉలిక్కిపడేలా చేసిన కరోనా మహమ్మారి.. మనల్ని ఎంతలా వణికించిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. లక్షల మంది ప్రాణాలను బలిగొన్న ఈ భయంకరమైన భూతం.. మరెంతో మంది జీవితాలను రోడ్డుపాలు చేసేసింది. ప్రపంచ దేశాలను అల్లాడేలా చేసింది. ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చింది. ఇప్పుడిప్పుడే ఈ భూతం కోరల్లోంచి ప్రపంచం నెమ్మదిగా బయట పడుతోంది. ప్రస్తుతం చాలా దేశాల్లో కరోనా టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే కరోనా మహమ్మారి మిగిల్చిన గాయాలు మాత్రం ఇంకా మానలేదు.
ఈ పరిస్థితికి అద్దం పట్టేలా ఉన్న ఘటన మన దేశంలోనే జరిగింది. కరోనా కారణంగా వేతనాల్లో కోత పడటంతో ఏం చేయాలో పాలుపోని ఓ 38 ఏళ్ల బస్ కండక్టర్ మరో దారిలేక, తప్పనిసరి పరిస్థితుల్లో హృదయవిదారక నిర్ణయం తీసుకున్నాడు. కరోనా మిగిల్చిన కష్టాల నుంచి బయట పడేందుకు.. తన కిడ్నీలను సోషల్ మీడియాలో అమ్మకానికి పెట్టాడు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. ‘‘నేను రవాణా శాఖలో పని చేస్తున్నా. కరోనా కారణంగా జీతాల్లో కోతలు పడుతున్నాయి. దీంతో నిత్యావసర సరుకులు కొనలేని, ఇంటి అద్దె చెల్లించలేని దీన స్థితికి చేరాను. అందుకే నా కిడ్నీని అమ్మకానికి పెడుతున్నా. అవసరమైన వాళ్లు కాంటాక్ట్ అవ్వండి. ఇదే నా ఫోన్ నంబరు’’ అని ఈశాన్య కర్ణాటక ఆర్టీసీ (ఎన్ఈకేఆర్టీసీ)కి చెందిన గంగావతి డిపోలో పనిచేస్తున్న హనుమంత కాలేగర్ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్టు చేశాడు.
తనకు మరో దారిలేకే ఈ నిర్ణయం తీసుకున్నానని సదరు బస్ కండక్టర్ ఆవేదన వ్యక్తం చేశాడు. వేతనంలో కోత కారణంగా ఇంటి అద్దె, నిత్యావసరాలు, పిల్లల చదువు, తల్లిదండ్రులకు వైద్య చికిత్సలు అన్నీ భారంగా మారాయని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు చెప్తూ కన్నీరు పెట్టుకున్నాడు. దీనిపై స్పందించిన ఎన్ఈకేఆర్టీసీ కొప్పల్ డివిజినల్ కంట్రోలర్ ఎంఏ ముల్లా.. హనుమంత కాలేగర్ విధులకు సరిగా హాజరు కావడం లేదని, అందుకనే వేతనం పూర్తిస్థాయిలో అందడం లేదని వివరించారు. అతను రోజూ విధులకు వస్తే ఇన్ని సమస్యలు ఉండవని కాలేగర్ కుటుంబ సభ్యులకు కూడా చెప్పినట్టు పేర్కొన్నారు.