బెంగళూరు: అతను ఇక లేవడని, బ్రెయిన్ డెడ్ అని డాక్టర్లు డిక్లేర్ చేసేశారు. దీంతో అతని పోస్ట్ మార్టం కోసం అంతా రెడీ చేశారు. డాక్టర్లు గ్లౌజులు గట్రా వేసుకొని, డిసిన్ఫెక్ట్ చేసుకొని రెడీ అయిపోయారు. ఇంతలో ఆ బృందంలోని ఓ డాక్టర్.. టేబుల్పై ఉన్న పేషెంట్ శరీరాన్ని టచ్ చేశాడు. అంతే ఆయనకు దిమ్మతిరిగినంత పని అయింది. ఎందుకంటే ఆ పేషెంట్ దేహంపై రోమాలు నిక్కపొడుచుకుని ఉన్నాయి. అదే సమయంలో అతని వేళ్లు కూడా కదిలాయి! వాళ్లంటే డాక్టర్లు కాబట్టి జస్ట్ షాకై వెంటనే అతన్ని మళ్లీ ట్రీట్మెంట్ కోసం తరలించారు. అదే మామూలు మనుషులైతే? చనిపోయాడని కచ్చితంగా తెలిసిన తర్వాత అలా చేతివేళ్లు కదిలితే ఉంటే.. పైప్రాణాలు పైనే పోయి ఉండేవి! ఈ షాకింగ్ ఘటన కర్ణాటకలోని బాగల్కోట్ ప్రాంతంలో వెలుగు చూసింది.
బెళగావికి చెందిన శంకర్ గోంబి అనే యువకుడు ఫిబ్రవరి 27న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికంగా ఉన్న ఓ హాస్పటల్కు హుటాహుటిన తరలించారు. అక్కడి డాక్టర్లు రెండు రోజుల పాటు వైద్యం చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఇక లాభం లేదని తేల్చేసిన డాక్టర్లు.. శంకర్ బ్రెయిన్ డెడ్ అయ్యాడని చెప్పారు. వెంటిలేటర్ పైనుంచి తొలగించగానే శంకర్ తుది శ్వాస విడుస్తాడని, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకోవాలని అతడి కుటుంబ సభ్యులకు సూచించారు. దీంతో ఆ కుటుంబం బాధాతప్త హృదయాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకుంది.
ఈ క్రమంలోనే శంకర్కు పోస్టుమార్టం చేయడానికి వైద్యులు సిద్ధమయ్యారు. సోమవారం నాడు శంకర్ను మహాలింగ్పూర్లోని ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చారు. ఎస్ఎస్ గాలిగలి అనే డాక్టర్కు పోస్టుమార్టమ్ బాధ్యతను అప్పగించారు.
పోస్టుమార్టం ప్రారంభించే సమయంలో గాలిగలి.. శంకర్ శరీరాన్ని తాకారు. అప్పుడే శంకర్ రోమాలు నిక్కపొడుచుకొని ఉన్నట్టు డాక్టర్ గుర్తించారు. వెంటిలేటర్ తొలగించిన తర్వాత శంకర్ తన వేళ్లను కూడా కదిపాడు. పల్స్ ఆక్సీమీటర్తో పరీక్ష చేయగా నాడి కొట్టుకోవడం కూడా డాక్టర్ గుర్తించారు. దీంతో ఆయన శంకర్ కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో పాటూ శంకర్ను మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ‘‘నా 18 ఏళ్ల వైద్య వృత్తిలో ఇలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదు’’ అని గాలిగలి చెప్పారు.