భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్గా ఎంతో సక్సెస్ఫుల్ చరిత్ర కలిగిన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి ఏమైంది. కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం విషయంలో ఎటువంటి వార్తలు వినిపిస్తున్నాయో తెలియంది కాదు. జనవరి 2న జిమ్లో ఛాతి నొప్పితో సడెన్గా పడిపోయిన గంగూలీకి గుండెపోటు వచ్చినట్లుగా నిర్ధారించిన డాక్టర్లు ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించి స్టెంట్ వేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయనను డిశ్చార్జి చేసి.. గంగూలీకి ఏం కాలేదని, భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. కాకపోతే మరో ఆపరేషన్ కూడా నిర్వహించాలని అప్పుడే డాక్టర్లు తెలిపారు.
తాజాగా మరోసారి గంగూలీకి ఛాతి నొప్పి రావడంతో.. మళ్లీ ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. అయితే గంగూలీ ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దని, ఇది సహజంగా అందరికీ వచ్చే ఛాతిలో నొప్పి వంటిదేనని అపోలో ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ దేవి షెట్టి చెప్పారు. ప్రస్తుతం గంగూలీ అపోలో ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ దేవి షెట్టి మాట్లాడుతూ.. ‘‘గంగూలీకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన విషయం అంతకంటే లేదు. భారతీయులలో చాలా మందికి సహజంగా కరోనరీ ఆర్టెరీ బ్లాకేజ్ సమస్యలు ఉంటాయి. భయపడేంత డ్యామేజీ ఏం లేదు. సరైన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు కాబట్టి.. ఆయన త్వరలోనే సమస్య నుంచి బయటపడతారు..’’ తెలిపారు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు అనే విషయం తెలిసిందే.