ఇళ్లలో ముసలి వాళ్లకు మనుమలంటే చాలా ప్రేమ ఉంటుంది. మనవళ్లు, మనుమరాళ్ల కోసం ఎంత పెద్ద త్యాగం చేయడానికైనా వాళ్లు వెనుకాడరు. సరిగ్గా ఇలాంటిదే తన మనుమరాలి కలలను నిజం చేయడం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన ఓ తాతయ్య కథ తాజాగా వెలుగు చూసింది. ఈ కథ తెలిసిన అనేక మంది మనసులు చలించాయి. మానవత్వం పెళ్లుబికింది. దీంతో వాళ్లంతా ఆ తాతయ్యకు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. బిజీ బిజీ జీవితాల్లో ఇంట్లో వాళ్లనే పట్టించుకునే తీరిక ఎవరికీ ఉండటం లేదనే మాటలను తప్పు అని నిరూపిస్తూ.. కాంక్రీట్ జంగిల్స్లా మారిన సిటీల్లో కూడా స్పందించే హృదయం గల దాతలు ఉన్నారని నిరూపించారు. వీరికి వారధిగా ‘హ్యూమన్స్ ఆఫ్ బోంబే’ నిలిచింది.
‘హ్యూమన్స్ ఆఫ్ బోంబే’ ఫేస్బుక్ పేజ్లో దేశ్రాజ్ (74) అనే ఓ తాతయ్య కథను ప్రచురించారు. తన మనుమరాలి కలను సాకారం చేయడం కోసం ఆయన చేసిన త్యాగం ఏంటో చక్కగా వివరించారు. దీంతో అనేక మంది మానవత్వంతో స్పందించి, విరాళాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. దీంతో మొత్తం మీద ఆయనకు రూ.24 లక్షల వరకు విరాళాలు లభించాయి.
దేశ్రాజ్ ఓ ఆటో డ్రైవర్. ఆయనకు ఇద్దరు కుమారులు. వారిద్దరూ మరణించారు. దీంతో తన భార్య, కోడలు, మనుమలను ఆయనొక్కరే పోషిస్తున్నారు. ఆయన మనుమరాలికి కాలేజి చదువులు చదవాలనే బలమైన కోరిక ఉంది. తమ కుటుంబంలో కనీసం ఒకరైనా గ్రాడ్యుయేట్ అవ్వాలని, టీచర్ అవ్వాలని దేశ్రాజ్ కూడా కోరుకున్నారు. కానీ ఆయన స్థోమత దానికి సరిపోలేదు.
గత ఏడాది 12వ తరగతి పరీక్షల్లో దేశ్రాజ్ మనుమరాలికి 80 శాతం మార్కులు వచ్చాయి. ఈ విషయం తెలిసిన ఆయన సంతోషానికి హద్దులు లేవు. ఆమెను పెద్ద చదువులు చదివించాలని గట్టిగా నిర్ణయించుకుని, ఇంటిని అమ్మేశారు. ఉండటానికి చోటు లేకపోవడంతో తన భార్య, కోడలు, మనుమలను స్వగ్రామంలోని బంధువుల ఇంటికి పంపించారు. తను మాత్రం ముంబైలో ఆటోలోనే కాలం గడుపుతున్నారు.
దేశ్రాజ్ కథ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. సుమారు రెండు లక్షల లైక్స్, వేలాది షేర్లు వచ్చాయి. దీన్ని చదివిన దాతలు విరాళాల రూపంలో రూ.24 లక్షలు ఇచ్చారు. మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు. దీంతోనైనా ఆయన కష్టాలు తీరతాయని కోరుకుందాం.