తెలంగాణ: ఎస్సీలకు కల్ప తరువుగా మినీ డెయిరీ పైలట్ ప్రాజెక్టు పని చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి మంత్రి.. ఎస్సీ లబ్ధిదారులకు మినీ డెయిరీ పైలట్ ప్రాజెక్టు కింద రూ.17.40 కోట్ల విలువైన 435 పాడి గేదెలను పంపిణీ చేశారు. ఇందులో రూ.10.44 కోట్ల సబ్సిడీ లభించనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక్కో ప్రాజెక్టు విలువ రూ.4 లక్షలు కాగా, ప్రతి లబ్ధిదారుడికి 4 పాడి గేదెలను ఇస్తారన్నారు. 4 లక్షల లోనులో రూ.2.40లక్షల సబ్సిడీ లభిస్తుండగా, కేవలం రూ.1.60 లోలు మాత్రమే రుణంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కులాల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, విజయ డెయిరీ సంస్థ, ఎస్సీ కార్పొరేషన్, వివిధ విభాగాల అధికారులు, లబ్ధిదారులు, ప్రజలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ‘‘మినీ డెయిరీ పైలట్ ప్రాజెక్టుని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు సబ్సిడీపై ఇచ్చే పాడి గేదెల ద్వారా వచ్చే పాలను ప్రభుత్వ సంస్థ విజయ డెయిరీ తీసుకుని, ఒక్కో లీటర్ పాలకు అదనంగా రూ.4ని ప్రోత్సాహకంగా ఇస్తుంది. రైతులకు రావాల్సిన డబ్బులను విజయ డెయిరీ వారి ఖాతాల్లో వేస్తుంది. క్రమేణా వారి రుణం కూడా తీరిపోతుంది. ఆ తర్వాత ఆ పాడితో వచ్చేదంతా లాభమే. అయితే లబ్ధిదారులు ఒక సొసైటీలా ఏర్పడి, ఆ సొసైటీని విజయ డెయిరీకి అనుసంధానించాలి. ఈవిధంగా ఒక్కో కుటుంబం నెలకు 15వేల నుంచి 20 వేల వరకు సంపాదించవచ్చు..’’ అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘నేనూ రైతు బిడ్డనే.. ఇలాంటి పథకాన్ని గతంలో ఎన్నడూ చూడలేదు. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు మినీ డెయిరీ ప్రాజెక్టుని ప్రభుత్వం ప్రారంభించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2084 మంది లబ్ధిదారులకు రూ.80 కోట్ల విలువైన పాడిగేదెల పంపిణీ జరుగుతున్నది. ఇందులో రూ.50 కోట్ల మేర సబ్సిడీ లభిస్తుంది. వరంగల్ రూరల్ జిల్లాలో 611 మంది లబ్ధిదారులకు ఈ అవకాశం కల్పించాము. 26 సొసైటీల ద్వారా 72 పాలకేంద్రాలను ఏర్పాటు చేశామని రైతు సోదరులకు తెలియజేస్తున్నాను. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, పథకమేదైనా, నర్సంపేటకు ఎక్కువ లబ్ధి చేకూరే విధంగా చేస్తున్నారు. వారిని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను..’’ అని తెలిపారు.