కమెడియన్ కమ్ హీరోగా మారిన అలీ.. ఇప్పుడందరినీ కలుపుకుని వెళుతున్నారు. ఆయన నిర్మాతగా అలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ స్థాపించి.. ‘అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అలీ, నరేష్ ప్రధాన పాత్రల్లో శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఇప్పటికే అలీకి హీరోగా లైఫ్ ఇచ్చిన ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డిలు నటిస్తున్నారు. తాజాగా ‘యమలీల’ చిత్రంలో అలీకి అమ్మగా పాత్ర వేసిన మంజు భార్గవి కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో చేస్తోంది. తాజాగా ఈ చిత్ర విశేషాలను తెలిపేందుకు చిత్రయూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు అందరూ పాల్గొన్నారు.
ఈ మీడియా సమావేశంలో సీనియర్ నటుడు వీకే నరేష్ మాట్లాడుతూ.. అలీ ఎంచుకున్న కథ కథనాలు బాగున్నాయి. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమా కచ్చితంగా అందరికి నచ్చుతుంది. ఈ సినిమా ఇప్పటివరకు 60 శాతం షూటింగ్ పూర్తయింది. సింగర్ మనో, భరణి గారు, పవిత్ర లోకేష్ వంటి పాపులర్ అర్టిస్ట్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశం అద్భుతంగా ఉండబోతోంది. ఇప్పటివరకు తెరమీద కనిపించని విధంగా ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ ఉండబోతోంది. అందరూ ప్రాణం పెట్టి ఈ సినిమాను చేస్తున్నారు.. అని తెలిపారు.
అలీ మాట్లాడుతూ.. 2021లో నేను నటిస్తూ నిర్మిస్తున్న సినిమా ఇది. అందరూ ఒక మంచి సినిమా చేస్తున్నావని అంటున్నారు. నరేష్గారు నేను పోటాపోటీగా నటిస్తున్నాము. 27 ఏళ్ల తరువాత మంజు భార్గవి నేను కలిసి నటిస్తున్నాను. యమలీల రోజులు గుర్తు వస్తున్నాయి. దాదాపు అందరూ సీనియర్ ఆర్టిస్ట్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఒక మంచి వాతావరణంలో ఈ సినిమా షూటింగ్ సజావుగా జరుగుతుంది. డైరెక్టర్ కిరణ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు, అందరూ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం కష్టపడి పనిచేస్తున్నారు. త్వరలో ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు తెలుపుతామని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ నటి మంజు భార్గవి, పవిత్ర లోకేష్, హీరోయిన్ మౌర్యానీ మాట్లాడుతూ.. చాలా మంచి పాత్రలు ఈ చిత్రంలో చేస్తున్నామని తెలిపారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన అలీ గారికి ధన్యవాదాలు. మాకు ఏం కావాలో అన్నీ సమకూరుస్తున్నారు. సినిమా బాగా వస్తోంది. షూటింగ్ సమయంలో ఇలా మీడియా వారిని కలవడం సంతోషంగా ఉంది. నరేష్ గారు అలీ గారు అద్భుతమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. మౌర్యానీ, పవిత్ర లోకేష్, రామ్ జగన్, భద్రమ్ అందరూ మంచి పాత్రల్లో కనిపించబోతున్నారు. ఎస్. మురళి మోహన్ రెడ్డి కెమెరా వర్క్, రాకేశ్ పళిడమ్ సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణ కానుందని డైరెక్టర్ శ్రీపురం కిరణ్ తెలిపారు.