మహా శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్క శివ క్షేత్రం భక్తులతో కిట కిటలాడింది. గత కొంత కాలంగా అన్ని దేవాలయాలు వాటి శోభను కోల్పోయి వెలవెల బోయాయి. ఇలా భక్తులతో దేవాలయాలు కళ కళ లాడుతుండడం చూస్తుంటే మరలా ఆ వైభవం వచ్చిందా అనిపిస్తుంది. కాగా నల్లగొండ జిల్లాలో కృష్ణానది తీరాన వెలసిన శివాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే స్వామి వారి శిరో భాగం ఎప్పుడు నీరు కారుతూ ఉండడమే. ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో గల శైవక్షేత్రాల్లో ఒకటైన ఈ శంభు లింగేశ్వర స్వామి ఆలయం మేళ్లచెరువు మండలంలో ఉంది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో కాకతీయుల కాలం నాటి యాదవులు నిర్మించారు. అక్కడి ప్రజలు ఈ ఆలయం గురించి, ఆలయ ప్రాముఖ్యతను గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు.
కాకతీయుల కాలంలో ఈ ప్రాంతంలోని ప్రజలు కరువు కాటకాలతో అల్లాడుతుండేవారని, వారి బాధలు చూడలేక ఆ పరమ శివుడే స్వయంగా వారి బాధలు తీర్చడం కోసం ఈ మేళ్లచెరువు అటవీ ప్రాంతంలో వెలిసినట్లు చెబుతుంటారు. అలా వెలసిన శివుడికి ఆవుల మందలోని ఒక ఆవు నిత్యం తన పొదుగు నుండి పాలను వదిలేది. ఇలా జరుగుతుండగా ఒక రోజు ఒక యాదవ రాజు అది గమనించి… ఆ శివ లింగాన్ని గొడ్డలితో 11 ముక్కలుగా నరికి వాటిని 11 ప్రదేశాలలో విసిరేశాడట. కానీ మరలా ఆ శివలింగం యధావిధిగా ఉండేదట.
ఇదిలా ఉండగా ఒక రోజు గంగబోయిన మల్లన్న అనే యాదవ రాజుకు స్వామి కలలోకొచ్చి, ఈ ప్రాంతం రానున్న కాలంలో దక్షిణ కాశీగా పేరు పొందుతుందని చెప్పడంతో… ఆయన వెంటనే ఈ ఆలయాన్ని నిర్మించారట. అప్పటి నుండి ఆ శివలింగం పెరుగుతూ ఉంటుందట. ఈ లింగం పై భాగంలో గంగమ్మ ఉందని.. ఎప్పుడూ నీరు వస్తూ ఉంటుందని అక్కడి ప్రజలు చెప్తున్నారు. ఎంత తీసినా ఆ నీరు అలా ఊరుతూనే ఉంటుందట. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఎంతో మంది ఇక్కడికి వస్తు ఉంటారు. మార్చి 11, శివరాత్రి కావున ఈ ఆలయం భక్తులతో కళ కళలాడింది.