న్యూఢిల్లీ: క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే దేశవాళీ క్రికెట్ పండుగ ఐపీఎల్ షెడ్యూల్ దాదాపుగా ఖరారు అయిపోయిందట. వచ్చే నెల 9న ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం అవుతుందని సమాచారం. ఈ లీగ్ ఫైనల్ మ్యాచ్ మే 30న జరిగుతుందని బీసీసీఐ వర్గాలు శనివారం వెల్లడించాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావల్సివుంది. ప్రస్తుతం భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న సిరీస్లోని ఆఖరి మ్యాచ్ ముగిసిన 12 రోజుల్లోనే.. మెగా క్రికెట్ లీగ్కు తెరలేవనుంది. అయితే, వచ్చే వారం జరిగే ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో 2021 ఐపీఎల్ షెడ్యూల్, వేదికలపై తుది నిర్ణయాన్ని తీసుకుంటారని సమాచారం. అప్పుడే ఐపీఎల్ వేదికలు, మ్యాచుల వేదికల వివరాలకు కన్ఫర్మ్ అవుతాయి.
కరోనా మహమ్మారి నేపథ్యంలో చెన్నై, కోల్కతా, బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్ వేదికల్లో ఈ సీజన్ నిర్వహించాలని బీసీసీఐ బోర్డులోని ఓ అధికారి చెప్పారు. అయితే, ముంబైలో మ్యాచ్ల నిర్వహణకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించాల్సి ఉందని తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలు, అంతర్జాతీయ మ్యాచ్ల షెడ్యూల్ను కూడా దృష్టిలో ఉంచుకొని లీగ్ తేదీలను ఖరారు చేస్తారని సమాచారం.
కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ చివరి సీజన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగిన సంగతి తెలిసిందే. దుబాయ్, అబుదాబి, షార్జా వేదికలుగా మ్యాచులు నిర్వహించాయి. దుబాయ్లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన రోహిత్ శర్మ టీం.. ఐదోసారి ఐపీఎల్ టైటిల్ను ఎగరేసుకుపోయింది. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఈ కారణంగానే ఈసారి ఐపీఎల్ను ఇక్కడే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిందట. అందుకే ఇక్కడే వేదికలను ఎంపిక చేసింది. ఇప్పుడా వేదికల్లో బయో-బబుల్స్ను ఏర్పాటు చేసే పనులు మొదలైపోయాయట. ప్రస్తుతం జరగుతున్న దేశవాళీ పోటీలు కూడా బయో సెక్యూర్ వాతావరణంలోనే జరుగుతున్న సంగతి తెలిసిందే.