ఛింద్వాడా: ‘‘మతం, కులంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చేతులెత్తి మొక్కేది ఒక్క డాక్టరుకే’’ అంటూ అదేదో సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన డైలాగ్ గుర్తుందా? ఈ సినిమా చూడలేదో లేక ఈ డైలాగ్ వినలేదో తెలీదుకానీ.. ఓ యువకుడు తనకు వైద్యం చేసిన డాక్టరుకే పెద్ద షాకిచ్చాడు. ఫీజు అడిగాడని డాక్టరుపై దాడి చేసి తనకు వైద్యం చేసిన చేతివేలు కొరికి పారేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఛింద్వాడాలో చోటు చేసుకుంది. ఈ సంగతి తెలిసిన వాళ్లందరూ ‘అయ్యో పాపం’ అని సదరు డాక్టరుపై సానుభూతి చూపిస్తున్నారు కూడా.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఛింద్వాడా పరిధిలోని కుండీపురా పోలీస్ స్టేషన్ పరిధిలో శనిచరా బజార్లోని ఓ చిన్న ఆస్పత్రి ఉంది. దీన్ని డాక్టర్ ఎస్కే బింద్రా అనే డాక్టర్ ఈ ఆస్పత్రిపైనే జీవనం సాగిస్తున్నాడు. శనివారం రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో ఒక యువకుడు తన చేయి కాలిపోయిందని, చికిత్స చేయాలని బింద్రా క్లినిక్కు వచ్చాడు. అతని వెంట మరో ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారు. డాక్టర్ బింద్రా, అతని సిబ్బంది బాధిత యువకుడికి చికిత్స అందించారు.
ట్రీట్మెంట్ పూర్తి చేసిన తరువాత డాక్టర్ బింద్రా.. బాధితుణ్ణి ఫీజు కట్టాలని అడిగాడు. అంతే.. ఆ పేషెంట్తో పాటు వచ్చిన స్నేహితులకు కోపం వచ్చేసింది. మమ్మల్నే ఫీజు అడుగతావా? అంటూ క్లినిక్ను ధ్వంసం చేయడానికి ట్రై చేశారు. చాలా కష్టపడి వారిని డాక్టర్ బింద్రా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పేషెంట్ స్నేహితుల్లో ఒకడైన విజయ్ తివారీ అనే వ్యక్తి డాక్టర్ చేతి వేలిని తన నోటిలో పెట్టుకుని గట్టిగా కొరికి పారేశాడు. డాక్టర్ చేతివేలు ఊడి వచ్చిందంటే.. అతను ఎంతలా కొరికాడో అర్థం చేసుకోవచ్చు.
అంతటితో ఆగకుండా క్లినిక్లోని ఫర్నీచర్ను, వాటర్ కూలర్ను ధ్వంసం చేశారు. అయితే ఈ దుర్మార్గం మొత్తం క్లినిక్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆ తర్వాత ఘటనపై బాధిత డాక్టర్ బింద్రా.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే జిల్లా ఆసుపత్రిలో చేరి వైద్య చికిత్స తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.