Friday, October 18, 2024

షర్మిల కొత్త పార్టీపై తెలంగాణలో టాక్ ఏంటి..!?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి.. వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని తెలంగాణలో కొనసాగించకుండా తన సొంత అజెండా, జెండాతో ముందుకెళ్తున్నారు. మంగళవారం నాడు జరిగిన సమావేశంతో అసలు సీన్ అందరికీ అర్థమైపోయింది. రాజన్న రాజ్యం తేవడానికే తాను వస్తున్నానని జగనన్న వదిలిన బాణమైన షర్మిల కీలక ప్రకటనే చేశారు. ఇవాళ లోటస్‌పాండ్‌లో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైఎస్ వీరాభిమానులు, అనుచరులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. అయితే.. షర్మిల స్థాపించబోయే కొత్త పార్టీపై తెలంగాణలో టాక్ ఎలా ఉంది..? తెలంగాణ ఇప్పటికే రాజకీయాల్లో పండిపోయి ఉన్న నేతలు ఏమంటున్నారు..? బీజేపీ, కాంగ్రెస్, టీర్ఎస్‌కు చెందిన నేతలు ఏమంటున్నారనే విషయాలు ఈ కథనంలో చూద్దాం.

ఇక్కడ కాదు ఏపీలో పెట్టుకోవాలి..
సీఎం జగన్ తనకు ఎంపీ సీటు ఇవ్వలేదని షర్మిల కోపంతో ఉన్నారు. అన్న మీద కోపంతో తెలంగాణలో కొత్త పార్టీ పెడితే ఏం లాభం. జగన్‌పై కోపం తీర్చుకోవాలంటే షర్మిల ఏపీలో పార్టీ పెట్టుకోవాలి. ఇలా పార్టీలు పెట్టించడంలో కేంద్ర హోం మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా దిట్ట. కాంగ్రెస్‌లోని రెడ్డి సామాజిక వర్గం ఎవరూ షర్మిల పార్టీలోకి వెళ్లరు అనే నేను అనుకుంటున్నాను. – వి. హనుమంతరావు, కాంగ్రెస్ సీనియర్ నేత.

కేసీఆర్ వదిలిన బాణం..
వైఎస్ షర్మిల.. సీఎం కేసీఆర్ వదిలిన బాణం. వైఎస్‌కు తెలంగాణలో అభిమానులున్నారు. అంతమాత్రాన షర్మిల పార్టీ పెడితే మాత్రం ఎవరూ అంగీకరించరు. అన్నతో పంచాయతీ ఉంటే షర్మిల ఏపీలోనే చూసుకోవాలి. షర్మిల పార్టీపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదు. కేసీఆర్ వ్యతిరేక ఓట్లు చీల్చేందుకే పార్టీ పెట్టిస్తున్నారా..?. రాజన్న బిడ్డగా షర్మిలకు సారె పెట్టి పంపుతాం కానీ.. పార్టీ పెడితే మాత్రం తెలంగాణ ప్రజానీకం ఆమోదించదు. తెలంగాణ బిడ్డలు ఏలుకోవడానికే రాష్ట్రం తెచ్చుకున్నామని.. రాజన్న బిడ్డగా తెలంగాణను ఏలడానికి కాదు. కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు కేసీఆర్ వదిలిన బాణమే షర్మిల. – ఎంపీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ.

సమైక్య వాదుల పెత్తనమొద్దు..!
తెలంగాణలో షర్మిల పార్టీపెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో సమైక్య వాదుల పెత్తనం మాకొద్దు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణాలో ఫ్యాక్షన్ రాజకీయాలు స్వాగతించం. ఆంధ్రాలో చేయలేని పెత్తనం తెలంగాణలో మాకెందుకు..?. అధికార దాహం కోసం తెలంగాణలో పార్టీ పెట్టె ప్రయత్నం చేస్తే ఓయూ విద్యార్ధి జేఏసీ తీవ్రంగా ప్రతిఘటిస్తుంది. తెలంగాణ మంచి నాయకత్వంలో అభివృద్ధి చెందుతుంది. – ఉస్మానియా యూనివర్శిటి జేఏసీ.

వైఎస్ వారసులు వాళ్లే..
ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. ఏ పార్టీ కావాలో ప్రజలు నిర్ణయించి చెబుతారు. వైఎస్సార్ మరణం రాష్ట్రానికి నష్టం చేసింది. వైఎస్ వారసులు కాంగ్రెస్ కార్యకర్తలే.. వైఎస్ కుటుంబ సభ్యులు వారసులు కారు. వైఎస్‌ను సీఎం చేసింది కాంగ్రెస్ పార్టీనే. కొత్త పార్టీలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. – షబ్బీర్ అలీ, కాంగ్రెస్ సీనియర్ నేత.

ఒక్కొక్కరిగా ఒక్కోసారి..
వైఎస్ షర్మిల ఒక్కోసారి ఒక్కొక్కరికి బాణంగా ఉపయోగపడుతున్నారు. షర్మిల ఇతర పార్టీలకు మేలు కోసం రాజన్న పేరును వినియోగించొద్దు. కొన్ని పార్టీల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఉపయోగపడొద్దు. రాజీవ్ రాజ్యం అయినా రాజన్న రాజ్యం అయినా కాంగ్రెస్‌తోనే సాధ్యం. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి వేరు వేరు కాదు. ఆమె పార్టీ వెనుక ఎవరున్నారో త్వరలో బయటపడుతుంది. – ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్.

షర్మిల వెనుక కేసీఆర్..
షర్మిల పార్టీ వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ నుంచి తన సీఎం కుర్చీని కాపాడుకోవడానికి.. తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి కేసీఆర్ ఇలా కొత్త రాజకీయ సమీకరణాలను తెరపైకి తీసుకొస్తున్నారు. ఇందులో ఒక భాగమే షర్మిల రాజకీయ పార్టీ. తెలంగాణలో టీఆర్ఎస్, కేసీఆర్ హవా తగ్గింది. అందుకే కేసీఆర్‌ను కాపాడేందుకు కేవీపీ రామచంద్రరావు రంగంలోకి దిగారని ప్రభాకర్ చెప్పారు. ఆయనే షర్మిలతో పార్టీ పెట్టిస్తున్నారని అన్నారు. కేసీఆర్ కనుసన్నల్లో, కేవీపీ ఆలోచనలతోనే షర్మిల ముందుకు వెళుతున్నారని చెప్పారు. ఇటీవలి కాలంలో కేటీఆర్ సీఎం అంటూ ఆయన భజనపరులు ఒత్తిడి పెంచుతున్నారని… అందుకే కేసీఆర్ కొత్త సమీకరణలకు తెరలేపారు. – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ నేత.

షర్మిలపై పోస్టులు పెట్టొద్దు..
మీ అన్న మీకు అన్యాయం చేసుంటే ఆంధ్రకు వెళ్లి నిలదీయాలి. తెలంగాణలో ఏం పని చెల్లెమ్మా..! అని పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు ప్రశ్నించారు. అంతేకాదు.. షర్మిల ఫ్లెక్సీలకు చెప్పుల దండలు వేసిన ఫ్లెక్సీలను కూడా వైరల్ చేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులకు హైకమాండ్ నుంచి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. షర్మిలకు వ్యతిరేకంగా పెట్టిన పోస్టులను, ఫొటోలను తొలగిస్తున్నారు.

పై విధంగా ఎవరికి తోచినట్లుగా వారు నేతలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. అయితే షర్మిల మాత్రం రాజన్న రాజ్యం కోసం తెలంగాణలో పార్టీ పెడతాననే క్లారిటీ చెప్పేశారు. మరి ఇన్ని అవాంతరాల మధ్య షర్మిల పార్టీ ముందుకెళ్తారా..? లేకుంటే మిన్నకుండిపోతారా..? అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

*షర్మిల కొత్త పార్టీ పెడతారా.. వైసీపీతోనే ముందుకెళ్తారా!?
*జగన్-షర్మిల మధ్య విభేదాలు నిజమే.. భారతీకి కూడా!
*నా దారి నాదే.. రాజన్న రాజ్యం కోసం పార్టీ..
*జగన్ నచ్చజెప్పినా వినకుండా గీత దాటిన షర్మిల!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments

Related Articles

Social Share

2,894FansLike
4,583FollowersFollow
8,907FollowersFollow
3,457FollowersFollow
2,267FollowersFollow
6,786SubscribersSubscribe
- Advertisement -
0
Would love your thoughts, please comment.x
()
x